కలం పవర్ న్యూస్ - క్రైమ్ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మే 11 ( కలం పవర్ బ్యూరో ) : మహబూబ్ నగర్ జిల్లాలో సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల రహదారుల పై ప్రమాదాల వల్ల రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి... ఆది వారం రాత్రి మహబూబ్నగర్ పాలకొండ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంతో దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ ఓ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు కారులో ఉన్న ముగ్గురు , అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్య డ్రైవింగ్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. యువకుల నిర్లక్ష్యపు బైక్ రేసింగ్ సరదా ఐదుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మహబూబ్నగర్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాను విషాదంలో ముంచెత్తింది. పాలకొండ బైపాస్ రోడ్డుపై అత్యంత వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొనడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్పై ఉన్న హైదరాబాద్కు చెందిన యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి కూడా మృతి చెందారు. ఈ ఘటనతో మహబూబ్నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా బైపాస్ రోడ్డుపై రాత్రివేళల్లో జరుగుతున్న బైక్ రేసింగ్లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, బైపాస్ను బైక్ రేసర్ల అడ్డాగా మార్చేశారని ఆరోపిస్తున్నారు. “ప్రతి రోజు రాత్రి స్పోర్ట్స్ బైక్లతో యువకులు బైపాస్పై రేసింగ్లు చేస్తుంటారు… చెవులు పగిలేలా శబ్దాలు చేస్తూ ప్రాణాలతో ఆటలాడుతుంటారు… పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు” అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాలకొండ బైపాస్ రోడ్డుపై కొంతమంది యువకులు నిత్యం స్పోర్ట్స్ బైక్లతో రేసింగ్లు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బైక్ స్టంట్లు, అతి వేగంతో రేసులు పెరిగిపోవడంతో సాధారణ ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారని చెబుతున్నారు. ప్రజలు ప్రయాణించే ప్రధాన రహదారిని రేసింగ్ ట్రాక్లా మార్చడం వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ బైపాస్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వేగ నియంత్రణ చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, పోలీసు నిఘా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “పాలమూరు బైపాస్లలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదు” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “ఒక్కరి నిర్లక్ష్యం… ఎన్నో కుటుంబాల జీవితాలను చీకటిలోకి నెట్టింది” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఫ్రెష్ మీట్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి డివైడర్ ను ఏర్పాటు చేశారు కాని ఇందులో ఫ్రెష్ మీట్ అనే వ్యాపార సంస్థకు అనుకూలంగా వుండడం కోసమే ఈ స్థలంలో డివైడర్ ను ఏర్పాటు చేశారు అని ఆరోపణలు వచ్చాయి.
Admin
Kalam Power News